టోక్యో ఒలింపిక్స్ కోసం సన్నద్ధమవుతున్న భారత ఆర్చర్లకు ప్రపంచ ఆర్చరీ(డబ్ల్యూఆర్) తీపి కబురు చెప్పింది. భారత ఆర్చరీ సంఘం(ఏఏఐ)పై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు డబ్ల్యూఆర్ గురువారం ప్రకటించింది. ఏఏఐ ఎన్నికలు గత వారం జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ ఏడాది జూలై 24 నుంచి జరిగే విశ్వక్రీడల్లో దేశం తరఫునే మన ఆర్చర్లు బాణాలను ఎక్కుపెట్టనున్నారు. కాగా, నిషేధం తొలగించిన డబ్ల్యూఆర్... ఏఏఐకు కొన్ని షరతులు విధించింది. అథ్లెట్ సభ్యత్వం కోసం నిబంధనల్లో మార్పులు చేయడంతో పాటు పాలనపరమైన సమస్యల పరిష్కారం, వ్యూహాత్మక ప్రణాళికను అభివృద్ధి చేసుకోవాలని సూచించింది. ఎన్నికల్లో నెలకొన్న వివాదాల కారణంగా వరల్డ్ ఆర్చరీ గతేడాది ఆగస్టు 5న ఏఏఐపై నిషేధం విధించింది. తాజాగా నిషేధం ఎత్తేయడంతో వచ్చే నెల లాస్వేగాస్లో జరిగే ఇండోర్ వరల్డ్ సిరీస్లో భారత ఆర్చర్లు దేశం తరఫున బరిలోకి దిగనున్నారు.